జిలేబీ బాబా: సమస్యలతో వచ్చిన మహిళలపై ఎలా అఘాయిత్యాలకు పాల్పడ్డాడు?

జిలేబీ బాబా

ఫొటో సోర్స్, BBC/PRABHU DAYAL

ఫొటో క్యాప్షన్, జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది
    • రచయిత, ప్రభు దయాళ్
    • హోదా, బీబీసీ కోసం

హరియాణాలోని టోహానాకు చెందిన ప్రముఖ స్వామీజీ జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.

మహిళలపై లైంగిక వేధింపుల కేసులో ఆయనకు ఈ శిక్ష విధించారు. ఈ కేసులో జిలేబీ బాబా ప్రధాన నిందితుడు.

అమర్‌పురి అలియాస్ బిల్లూ అలియాస్ జిలేబీ బాబాకు ఫతేహాబాద్‌లోని అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శిక్షను ఖరారు చేశారు.

జనవరి 5వ తేదీన బాబాను దోషిగా నిర్ధరించారు.

ఈ బాబాపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు కోర్టులో రుజువు అయ్యాయి.

అభ్యంతరకర వీడియోలు తీస్తూ మహిళలను బ్లాక్‌మెయిల్ చేసేవాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

అయిదేళ్ల క్రితమే పోలీసులు, బాబాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హజరు పరిచారు.

జిలేబీ బాబా

ఫొటో సోర్స్, BBC/PRABHU DAYAL

జిలేబీ బాబా ఎవరు?

పంజాబ్‌లోని మన్సాలో జన్మించిన బిల్లూ రామ్, ఎనిమిదేళ్ల వయస్సులో ఇల్లు వదిలి వెళ్లిపోయారు.

అక్కడి నుంచి దిల్లీకి చేరుకున్నారు. దిల్లీలో దిగంబర్ రామేశ్వర్ అనే బాబాతో ఆయనకు పరిచయం అయింది.

దిగంబర్ రామేశ్వర్‌ను గురువుగా భావించి ఆయనతో పాటు ఉజ్జయిన్ క్యాంపుకు వెళ్లి అక్కడే పదేళ్ల పాటు ఉన్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బిల్లూరామ్ చెప్పారు.

బిల్లూ రామ్ 18 ఏళ్ల వయస్సులో మన్సాలోని తన ఇంటికి తిరిగి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఆయనకు వివాహం చేశారు.

పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం ఆయన మన్సా నుంచి హరియాణాలోని టోహానా పట్టణానికి వెళ్లారు. అక్కడ జిలేబీ దుకాణాన్ని ప్రారంభించారు.

ప్రజలు బిల్లూ రామ్ దుకాణం వద్ద జిలేబీలు తినడంతో పాటు తమ ఇళ్లకు తీసుకెళ్లేవారని టోహానాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ గురుదీప్ భాటీ చెప్పారు.

కొద్ది రోజుల్లోనే బిల్లూ జిలేబీ ఆ ఊరు మొత్తంలో ఫేమస్ అయింది.

‘‘దాదాపు 20 ఏళ్ల క్రితం తన ఇంట్లోనే ఒక మందిరాన్ని బిల్లూరామ్ ఏర్పాటు చేశారు. ఆ మందిరంలో మహిళల సమస్యలకు ఆయన పరిష్కారాలు చెప్పేవారు. అలా ఆయన బిల్లూరామ్ నుంచి జిలేబీ బాబాగా మారిపోయారు’’ అని గురుదీప్ తెలిపారు.

ముఖ్యమైన విషయాలు

  • బిల్లూ అలియాస్ జిలేబీ బాబాకు ఫతేహాబాద్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది
  • పలువురు మహిళలను లైంగికంగా వేధించారని బాబాపై ఆరోపణలు ఉన్నాయి
  • అయిదేళ్ల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ సుదీర్ఘ కాలం పాటు సాగింది
  • కోర్టు జనవరి 5న బాబాను దోషిగా తేల్చింది
వీడియో క్యాప్షన్, 300 మంది యువతులకు వివాహం జరిపించిన గుజరాత్ వ్యాపారి

వివాదాల్లోకి జిలేబీ బాబా

బిల్లూరామ్ నిర్మించిన మందిరంలోకి శారీరక, మానసిక వ్యాధిగ్రస్తులైన మహిళలు వచ్చేవారని జర్నలిస్ట్ గురుదీప్ భాటి చెప్పారు.

బాబా మంత్రాలతో వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేవాడని ఆయన తెలిపారు. ఈ సమయంలోనే మహిళలకు టీ లేదా ఇతర తినుబండారాలలో మత్తు మందు కలిపి ఇవ్వడం ప్రారంభించారని, ఆ తర్వాత వారిని వేధింపులకు గురిచేసేవాడని ఆయన ఆరోపించారు.

మందిరంలో అమర్చిన రహస్య కెమెరాలతో మహిళలపై చేసిన అకృత్యాలను రికార్డు చేసి, తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారని ఆయన చెప్పారు.

పోలీసులు చెప్పినదాని ప్రకారం, మహిళలతో పాటు మైనర్లను కూడా ఇలా బాధితులుగా మార్చి వారి నుంచి బాబా భారీగా డబ్బు వసూలు చేసేవారు.

భయం కారణంగా తమకు జరిగిన ఘోరం గురించి మహిళలు తమ ఇళ్లలో లేదా పోలీసులకు చెప్పలేదు.

2017 అక్టోబర్ 13న ఒక మహిళ దీన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.

ఒక మహిళ ఫిర్యాదు మేరకు సిటీ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఐపీసీ 328, 376, 506 కింద కేసులు నమోదు అయ్యాయి.

బాబా అభ్యంతరకర వీడియోలను వైరల్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిలేబీ బాబాపై ఎన్డీపీఎస్, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కూడా కేసులు విధించారు.

తన వద్దకు వచ్చే మహిళలు, మైనర్లు అడిగే సందేహాలకు బాబా పరిష్కారాలు చెప్పేవారని, దానితో పాటు వారికి మత్తుమాత్రలు కూడా ఇచ్చేవారని పేర్కొన్నారు.

పోలీసులు దర్యాప్తు సందర్భంగా బాబా మందిరం నుంచి పట్టుకారు, బూడిద, అగరొత్తులు, మత్తు మాత్రలు, అనేక ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

దర్యాప్తు తర్వాత పోలీసులు, కోర్టులో చలాన్ సమర్పించారు. ఈ కేసును విచారించిన ఫతేహాబాద్ కోర్టు బాబా అలియాస్ బిల్లూ రామ్‌ను దోషిగా నిర్ధారించింది.

వీడియో క్యాప్షన్, కోటగిరి: గణేశ్ చందా ఇవ్వనందుకే టీచర్‌ను వివాదంలోకి లాగారా... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)