బావి నీళ్ల కోసం ఘర్షణల్లో 42 మంది మృతి.. ఛాడ్‌లో పెరుగుతున్న జలయుద్ధాలు

    • రచయిత, బాసిల్లియో రుకాంగా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

మధ్య ఆఫ్రికా దేశమైన ఛాడ్‌లో మంచినీటి బావి విషయంలో మొదలైన వివాదం, రెండు జాతుల మధ్య ఘర్షణకు దారితీసింది. తూర్పు ఛాడ్‌లో జరిగిన ఈ ఘర్షణలో దాదాపు 42 మంది చనిపోగా, మరో 10 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

వాడీ ఫిరా ప్రావిన్స్‌లో తొలుత రెండు కుటుంబాల మధ్య ప్రారంభమైన ఈ గొడవ, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఇది క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది, ఫలితంగా పలు గ్రామాల్లో ఇళ్లు, ఆస్తులు దహనమయ్యాయి.

ఉప ప్రధాన మంత్రి లిమనే మహామత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ ప్రాంతానికి వెళ్లిందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు ఛాడ్ అధికారులు ఆదివారం వెల్లడించారు.

ఛాడ్‌లో ఇలాంటి సామాజిక ఘర్షణలు సర్వసాధారణం. ఇక్కడ రైతులు, పశువుల కాపరుల మధ్య వివాదాలతో పాటు జాతుల మధ్య ఉద్రిక్తతలు సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నాయి. నీరు, మేత భూముల కోసం పోటీ తరచుగా ఈ ఘర్షణలకు కారణమవుతోంది.

వలసలతో ఉద్రిక్తత

ఇటీవలి నెలల్లో పొరుగు దేశమైన సూడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా శరణార్థులు ఛాడ్‌కు రావడం, ఇక్కడి వనరులు, భద్రతపై మరింత ఒత్తిడి పెంచి ఉద్రిక్తతలకు దారితీసింది.

సూడాన్ ఘర్షణలు సరిహద్దు ప్రాంతాన్ని అస్థిరపరచకుండా ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని లిమనే మహామత్ ఆదివారం ప్రకటించారు.

ఛాడ్‌లో జరుగుతున్న ఇటువంటి ఘర్షణలు ఇటీవలి కాలంలో వందలాది మంది మరణానికి కారణమయ్యాయి. గత నవంబర్‌లో నైరుతి ప్రాంతంలోని దిబేబేలో ఒక బావి విషయంలో వివాదం కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ థింక్-ట్యాంక్ గణాంకాల ప్రకారం.. 2021, 2024 మధ్య జరిగిన దాదాపు 100 ఘర్షణల్లో 1,000 మంది మరణించగా, 2,000 మంది గాయపడ్డారు.

వాతావరణ మార్పులే కారణం: ఆమ్నెస్టీ

గతేడాది మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన రిపోర్టులో.. 2022, 2024 మధ్య కాలంలో పశువుల కాపరులు, రైతుల మధ్య ఏడు హింసాత్మక సంఘటనలు జరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనల వల్ల 98 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

వాతావరణ మార్పులు, ఇతర సమస్యల కారణంగానే ఈ ఘర్షణలు జరుగుతున్నాయని, హింస పదేపదే పునరావృతమవుతున్నప్పటికీ ప్రజలను రక్షించడంలో అధికారులు విఫలమయ్యారని ఆ సంస్థ తెలిపింది.

భద్రతా దళాల స్పందన తరచుగా ఆలస్యమవుతోందని, నిందితులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆమ్నెస్టీ తెలిపింది. దీనివల్ల సమాజంలో నేరం చేసినా శిక్ష పడదని, అంతేకాకుండా తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన పెరుగుతోందని పేర్కొంది.

భద్రతా దళాల స్పందనలు తరచుగా ఆలస్యం అవుతున్నాయని, నిందితులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆమ్నెస్టీ తెలిపింది. దీనివల్ల సమాజంలో నేరం చేసినా శిక్ష పడదనే ధీమాతో పాటు, తాము వివక్షకు గురవుతున్నామనే భావన ప్రజల్లో పెరుగుతోందని పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)