You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగారంతో చేసిన శవ పేటిక, కోడి ఆకారంలో పుష్పగుచ్ఛం.. సమాధి దగ్గరకు అయిదు లారీలలో బొకేల తరలింపు.. ‘మెక్సికో డ్రగ్ లార్డ్’ అంత్యక్రియలు ఎలా చేశారంటే
- రచయిత, వనెస్సా బూష్ష్లూటర్
- హోదా, లాటిన్ అమెరికా డిజిటల్ ఎడిటర్
- చదివే సమయం: 3 నిమిషాలు
‘ఎల్ మెంచో’గా పిలిచే మెక్సికో ‘డ్రగ్ లార్డ్’ నెమెషియో ఒసెగుయెరా సెర్వాంటెస్ మృతదేహాన్ని బంగారు శవపేటికలో ఉంచి ఆయన కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది.
ఫిబ్రవరి చివరలో ఆయన్ను అరెస్ట్ చేయడానికి మెక్సికో ప్రత్యేక దళాలు ప్రయత్నించినప్పుడు జరిగిన కాల్పుల్లో గాయపడిన ఆయన తర్వాత మరణించారు.
59 ఏళ్ల ఎల్ మెంచో జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్(సీజేఎన్జీ)ను నడిపేవారు.. మెక్సికోలో మోస్ట్ వాంటెడ్.
ఆయన్ను పట్టుకునేందుకు అమెరికా ప్రభుత్వం 1.5 కోట్ల డాలర్ల బహుమతి ప్రకటించింది.
ఆయన మరణం తర్వాత హింస చెలరేగింది. కార్టెల్(డ్రగ్ ముఠా) సభ్యులు మెక్సికోలోని 20 రాష్ట్రాల్లో వాహనాలకు నిప్పు పెట్టి, రోడ్లను బ్లాక్ చేశారు.
భారీ భద్రత మధ్య అంత్యక్రియలు
జలిస్కో రాష్ట్రంలోని గ్వాడలహారా సమీపంలో జరిగిన అంత్యక్రియల సమయంలో భద్రతాసిబ్బందిని భారీగా మోహరించారు. మళ్లీ హింస జరగకుండా చర్యలు తీసుకున్నారు.
కోడిపందాలపై ఆయన ఇష్టానికి గుర్తుగా కోడి ఆకారంలో పుష్పగుచ్ఛాలు తీసుకొచ్చారు. మొత్తం పూల గుచ్ఛాలను సమాధికి తీసుకెళ్లడానికి ఐదు లారీలు అవసరమయ్యాయని ఏఎఫ్పీ తెలిపింది.
రాంచెరో మ్యూజిక్ "నార్కోకోరిడోస్" (డ్రగ్ ముఠా నాయకులను ప్రశంసించే పాటలు) వాయించారు.
ఆయన బంగారు శవపేటిక సమాధి స్థలానికి చేరుకున్నప్పుడు సంప్రదాయ ఎల్ముచాచో అలెగ్రె వాయించారని స్థానిక మీడియా తెలిపింది.
ఆయన అభిమానులు ముఖానికి మాస్కులు ధరించి శవపేటిక వెంట సమాధిస్థలి దగ్గరకు నడిచారు.
ఒక గంటపాటు ఈ కార్యక్రమం సాగింది.
‘హింస పెరిగే అవకాశం’
ఇతర ‘డ్రగ్ లార్డ్స్’ సమాధులతో పోలిస్తే, ఆయన సమాధి స్థలం చాలా సాధారణంగా ఉందని మెక్సికో మీడియా తెలిపింది. ఇతర డ్రగ్ లార్డ్స్ సమాధులపై గోపురాలుంటాయి.
ఓసేగెరా నాయకత్వంలో సీజేఎన్జీ ఒక శక్తిమంతమైన అంతర్జాతీయ క్రిమినల్ గ్రూప్గా మారింది. జలిస్కోలో ఉన్న తన ప్రధాన కేంద్రం నుంచి అది మెక్సికోలోని అనేక ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. అక్కడ అది మాదకద్రవ్యాల తయారీ, రవాణాలో పాల్గొంది.
మెక్సికన్ ప్రత్యేక దళాలు ఓసేగెరాను హతమార్చడం, అధ్యక్షురాలు క్లౌడియా షీన్బామ్ ప్రభుత్వానికి ఒక విజయంగా భావిస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని క్లౌడియాను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు.
అయితే ఈ శక్తిమంతమైన కార్టెల్ నాయకుడు మరణించడంతో రానున్నరోజుల్లో హింస పెరిగే అవకాశం ఉందన్న భయాలున్నాయి. ఎందుకంటే వేలాది మంది సభ్యులు ఉన్నట్లు అంచనా వేసే ఈ క్రిమినల్ గ్రూపులోని వేర్వేరు వర్గాలు నియంత్రణ కోసం ఒకరితో ఒకరు పోరాడే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)