You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత సమాజ వర్గీకరణకు 'కెమెరా' బ్రిటిష్ పాలకులకు ఎలా ఉపయోగపడిందంటే..
- రచయిత, సుధా జి తిలక్
- చదివే సమయం: 4 నిమిషాలు
భారత దేశం 19వ శతాబ్ధపు ద్వితీయార్థంలో ఎలా ఉండేదో తెలుసుకునేందుకు, వర్గీకరించేందుకు ఫోటోగ్రఫీ బ్రిటిష్ వారికి ఒక ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగపడింది.
టైప్క్యాస్టింగ్: ఫోటోగ్రాఫింగ్ ది పీపుల్స్ ఆఫ్ ఇండియా పేరుతో దిల్లీకి చెందిన డీఏజీ ఆర్ట్ గ్యాలరీ నిర్వహించిన ప్రదర్శనలో.. భారత సమాజ వర్గీకరణకు, వ్యక్తుల లేదా వృత్తుల గుర్తింపును నిర్ధరించేందుకు, దేశంలోని సంక్లిష్ట సామాజిక విభేదాలను వలస ప్రభుత్వం సులువుగా అర్థం చేసుకునేందుకు కెమెరాను ఉపయోగించిన 1855 నుంచి 1920 మధ్య కాలానికి చెందిన 200 అరుదైన ఫోటోలను ఒకచోటకు చేర్చారు.
ఆ 65 ఏళ్ల కాలానికి సంబంధించిన ఈ ప్రదర్శన.. ఈశాన్య భారతంలోని లెప్చా, భూటియాల నుంచి, వాయువ్యంలో అఫ్రిదీలు, నీలగిరిలోని తోడాలు, పశ్చిమ భారతంలోని పార్సీలు, గుజరాతీ సంపన్నుల వరకు మనుషుల భౌగోళిక విస్తరణను ప్రతిబింబిస్తుంది.
వలస పాలనలో సామాజికంగా దిగువ స్థాయి వర్గాలుగా పేర్కొన్న నృత్యకారిణులు, వ్యవసాయ కూలీలు, క్షురకులు, పాములను ఆడించే వాళ్లను కూడా ఇది పట్టి చూపుతుంది.
ఈ చిత్రాలు భారతీయ వైవిధ్యాన్ని గురించి మాత్రమే కాదు, ఫోటోగ్రఫీ ద్వారా వారు, వీరు అంటూ వర్గాలుగా స్థిరపరిచేందుకు, సులభంగా గుర్తించగలిగే వర్గాలుగా మార్చేందుకు ఉపయోగించిన తీరుకు అద్దం పడతాయి.
ది పీపుల్ ఆఫ్ ఇండియా పేరుతో 1868-1875 మధ్య ప్రచురితమైన 8 వాల్యూమ్ల ఫోటోగ్రాఫిక్ సర్వే కేంద్రీకృతంగా ఉన్న ఈ ప్రదర్శనను, చరిత్రకారిణి సుదేష్ణ గుహ రూపొందించారు. వీటిలో ప్రధానంగా, వలస పాలన కాలపు పరిస్థితులను కళ్లకు కట్టే శామ్యూల్ బౌర్న్, లాలా దీన్ దయాళ్, జాన్ బర్క్, షెపర్డ్ అండ్ రాబర్ట్సన్ వంటి ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలను చేర్చారు. వీటిని సిల్వల్ జెలటిన్ కోటింగ్ ప్రింట్ చేసి ఆల్బమ్గా మార్చారు.
"ఈ ఫోటోల సేకరణను మొత్తంగా కలిపి చూస్తే, ఎథ్నోగ్రాఫిక్ ఫోటోగ్రఫీ చరిత్రను.. అది బ్రిటిష్ పాలకులపై, భారతీయులపై చూపిన ప్రభావాన్ని వివరిస్తుంది. అప్పటి పరిస్థితుల గురించి లోతైన అవగాహన కలిగించే ఇలాంటి సేకరణ భారత్లో గతంలో ఎన్నడూ చూడలేదు" అని డీఏజీ సీఈఓ ఆశిష్ ఆనంద్ చెప్పారు.
ఆ ఎగ్జిబిషన్ నుంచి కొన్ని ఎంపిక చేసిన చిత్రాలివి: