You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘అరుణోదయ’ రామారావు కన్నుమూత.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన గాయకుడు
వామపక్ష ఉద్యమ గీతాలతో ప్రజాదరణ పొందిన గాయకుడు, సాంస్కృతిక కార్యకర్త 'అరుణోదయ' రామారావు ఇక లేరు.
అఖిల భారత సాంస్కృతిక కళాకారుల కన్వీనర్, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన రామారావు శనివారం రాత్రి గుండెపోటుకు గురవగా హైదరాబాద్లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో చేర్చారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన కన్నుమూశారు.
కాటిసీను పద్యాలకూ పెట్టింది పేరు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామానికి చెందిన ఆయన గత నాలుగు దశాబ్దాలుగా వామపక్ష ఉద్యమగీతాలు పాడుతూ ప్రసిద్ధికెక్కారు.
సన్నిహిత మిత్రుల వద్ద సత్య హరిశ్చంద్ర నాటకంలోని జాషువా కాటిసీను పద్యాలూ పాడేవారు.
తాను సుదీర్ఘ కాలం పనిచేసిన అరుణోదయ సంస్థ పేరే ఆయన ఇంటిపేరుగా మారి 'అరుణోదయ' రామారావుగా ఆయన ప్రజలకు సుపరిచితులు.
రామారావు హక్కుల, వామక్ష ఉద్యమాల్లో క్రియాశీలంగా పనిచేశారు. చనిపోయేవరకు కార్మిక రంగ ఉద్యమాల్లో ఉన్నారు.
సోమవారం అంత్యక్రియలు
రామారావు భార్య అరుణ ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకురాలు. ఆయనకు ఇద్దరు కుమారులు.
రామారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ విద్యానగర్లోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ కార్యాలయం మార్క్స్ భవన్లో ప్రజల సందర్శనార్థం సోమవారం ఉదయం 10 గంటల వరకు ఉంచుతున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ తెలంగాణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి డి.వి.కృష్ణ తెలిపారు.
అనంతరం రామారావు అంత్యక్రియలు అంబర్పేట స్మశానవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)