ఆంధ్రప్రదేశ్: తాడేపల్లిలో గంజాయి మత్తులో అంధురాలి దారుణ హత్య.. విజయవాడలో మహిళపై కత్తితో దాడి

ఫొటో సోర్స్, UGC
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్లో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు ఘటనలు కలకలం రేపుతున్నాయి. సీఎం నివాసం ఉంటున్న తాడేపల్లిలో ఓ అంధురాలిపై కత్తితో దాడి చేసి హత్య చేయడం విషాదం నింపింది.
విజయవాడలో మరో మహిళను వేధిస్తూ తన ఆవేదనను ఇంట్లో చెప్పినందుకు ఆగ్రహించి బాధితురాలి ఇంటిపైనే దాడి చేయడం దిగ్భాంతి కలిగిస్తోంది. కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో ఆమె తప్పించుకుందని పోలీసులకు ఫిర్యాదు అందింది.
తాడేపల్లిలో హత్య
తాడేపల్లి పరిధిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ అంధురాలిపై కత్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోగా ఎస్తేరు రాణి ప్రాణాలు కోల్పోయారు. తల మీద నరకడంతో ఆమెకు బాగా రక్తస్రావం అయిందని వెల్లడించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
"రాజు అనే నిందితుడు గంజాయి మత్తులో ఒంటరి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్థానికులు అతన్ని మందలించారు. దాన్ని మనసులో పెట్టుకుని ఆమెను కత్తితో బెదిరించేందుకు వెళ్లాడు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయాల పాలుకావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం జరిగినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు ధృవీకరించారు" అని తాడేపల్లి పోలీసులు మీడియాకు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
విపక్షాల ఆందోళనసీఎం నివాసానికి సమీపంలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత దయనీయం అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు కామెంట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కంటిచూపు లేని బాలికను హత్య చేయడం చూస్తుంటే రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల కారణంగా లా అండ్ ఆర్డర్ దుస్థితికి నిదర్శనంగా నిలుస్తుందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద నిరసన తెలిపారు. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను అడ్డుకున్నారు.
టీడీపీ మహిళా కార్యకర్తల ఆందోళనను పట్టించుకోకుండా ఆమె మార్చురీ వద్ద మృతురాలి బంధువులతో మాట్లాడి వెళుతుండగా కారుని అడ్డుకున్నారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కి తరలించారు."మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతోంది. సీఎం ఇంటికి కూత వేటుదూరంలోనే హత్యలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థమవుతుంది. హోం మంత్రి, డీజీపీ, చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించలేదు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరినందుకు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి సిగ్గులేదా.. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం మూలంగానే ఇదంతా జరుగుతోందంటూ" తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు.నిందితుడిని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు.
విజయవాడలో దాడి
విజయవాడలోని 50వ డివిజన్లో తనను వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించినందుకు, ఇంటిపై దాడి చేశారంటూ స్థానిక టీడీపీ కార్యకర్త వడ్డాది రమణపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ప్రశ్నించినందుకు తమ కుటుంబంపై దాడి చేసి, తన అత్తని గాయపరిచారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితులను పరామర్శించారు.కాల్ మనీ, సెక్స్ రాకెట్ వంటివి నడుపుతూ మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారని, బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె తెలిపారు.అయితే, తాడేపల్లిలో హత్య జరిగినా స్పందించకుండా, విజయవాడలో జరిగిన ఘటనపై మహిళా కమిషన్ స్పందించిన తీరుని టీడీపీ తప్పుబట్టింది.
తదుపరి, ప్రభుత్వాసుపత్రి వద్ద తాడేపల్లి మృతురాలి కుటుంబ సభ్యులను వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఆ సమయంలో టీడీపీ మహిళలు ఆమెతో వాగ్వాదానికి దిగారు."మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తున్నాం. బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించాం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. తాడేపల్లి, విజయవాడ ఘటనలపై మహిళా కమిషన్ స్పందించింది. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే విమర్శలను పట్టించుకోబోమని" ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ప్రభుత్వ, పోలీస్ వైఫల్యం
గంజాయి సహా మత్తుపదార్థాలన్నీ యధేచ్చగా అమ్మకాలు చేస్తున్నా అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని, మద్యం మత్తులో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు బి. ప్రభావతి అరోపించారు."ఏపీలో ప్రభుత్వ ప్రచారానికి, మద్యం, డ్రగ్స్ విక్రయాలకు పొంతన లేదు. సీఎం ఆఫీసుకి చేరువలో కత్తితో దాడి చేసి మహిళను హత్య చేసిన ఘటన చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందన్నది తేటతెల్లమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా గంజాయి అమ్మకాలు అడ్డుకోవాలి. పోలీసులు విపక్షాలను కట్టడిచేసేందుకు ఆతృత చూపుతూ, డ్రగ్స్ విక్రయాలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ఈ ఘటనలు ప్రభుత్వ, పోలీస్ యంత్రాంగం వైఫల్యమే. సీఎం బాధ్యత వహించాలి. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి"అని ఆమె డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:
- 'చనిపోయిన వ్యక్తి'ని కోర్టుకు తెచ్చి 14 ఏళ్ల శిక్ష వేయించిన అత్యాచార బాధితురాలి తల్లి, అసలేం జరిగింది?
- ఎంఎన్ఆర్ఈజీఏ: 'ఈ పథకం వల్లే ఇల్లు నడుస్తోంది, ఇది కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటో తెలీదు'
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి... తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- మహిళా క్రీడాకారుల గురించి మీకు ఎంత తెలుసు? ఈ క్విజ్ ప్రయత్నించండి
- పులులను బలి తీసుకుంటున్నది ఎవరు? ఒక్క రాష్ట్రంలోనే ఏడాదిలో 38 పులులు, 87 చిరుతల మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)













