నారా లోకేశ్ పాదయాత్రలో అస్వస్థతకు లోనైన నందమూరి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు.
ఉదయం 11 గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగా బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు.
ఈ క్రమంలో లక్ష్మీపురం వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొద్ది దూరం నడిచాక మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. మసీదు నుంచి బయటకు వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు.
తారకరత్నను తొలుత కేసీ ఆసుపత్రికి తరలించగా.. ఆ సమయంలో ఆయన స్పృహలో లేరని ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు తెలిపారు.
'ఆసుపత్రికి తీసుకురాగానే చికిత్స చేశాం. పల్స్ తక్కువగా ఉంది. ఏకోలో హార్ట్ రేట్ కనిపించింది. లోబీపీ ఉంది. మెరుగైన చికిత్స కోసం పీఈఎస్ఆసుపత్రికి పంపించాం’ అని కేసీఆస్పత్రి వైద్యులు తెలిపారు.
పీఈఎస్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ చేసి స్టంట్ వేశారని చెబుతున్నారు. తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అయిందని టీడీపీ నేతలు చెబుతుండగా ఆసుపత్రి వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు.
మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.