ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్, ఏం మాట్లాడారు?

ఫొటో సోర్స్, Debajyoti Chakraborty/NurPhoto via Getty Images
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు.
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పలు భవనాలు, సంస్థలపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఈద్, నౌరూజ్ పండుగ సీజన్ మిడిల్ ఈస్ట్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకొస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ''ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తూ, గ్లోబల్ సప్లై చెయిన్లకు ఆటంకం కలిగిస్తూ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని వివిధ భవనాలు, కార్యాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, షిప్పింగ్ మార్గాలను తెరిచి ఉంచడం, సురక్షితంగా రవాణా జరిగేలా చూడటం తదితర అంశాల ప్రాధాన్యతను మోదీ పునరుద్ఘాటించారు.
ఇరాన్లో ఉన్న భారతీయుల భద్రత, రక్షణ కోసం నిరంతర మద్దతు ఇస్తున్న అక్కడి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.


ఫొటో సోర్స్, Gavriil Grigorov/POOL/AFP via Getty Images
ఇరాన్ నేతలకు పుతిన్ శుభాకాంక్షలు...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ నాయకులకు నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరాన్కు రష్యా ఎప్పుడూ ఒక నమ్మకమైన మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి అని పేర్కొన్నారు.
''ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్లకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ నూతన సంవత్సర (నౌరూజ్) శుభాకాంక్షలు తెలిపారు. ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను హుందాగా అధిగమిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు'' అని క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Gavriil Grigorov/POOL/AFP via Getty Images
నతాంజ్ అణుకేంద్రంపై దాడి...
ఇరాన్ మధ్యప్రాంతంలో ఉన్న నతాంజ్ అణు కేంద్రంపై మరోసారి దాడి జరిగిందని ఇరాన్ అణుశక్తి సంస్థ తెలిపింది.
ఈ అణు కేంద్రం నుంచి ఎటువంటి రేడియో ధార్మిక పదార్థాల లీకేజీ జరగలేదని దర్యాప్తులో వెల్లడైందని, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ లేదని ఇరాన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ దాడిని అణుశక్తి సంస్థ ఖండించింది. ఇది అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ), ఇతర అణుభద్రతా నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది.
''నతాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగినట్లు ఇరాన్ సమాచారం ఇచ్చింది. ఈ దాడి తర్వాత పరిసర ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయిలలో ఎటువంటి పెరుగుదలా నమోదు కాలేదు. ప్రస్తుతం ఈ నివేదికపై మా సంస్థ దర్యాప్తు చేస్తోంది'' అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) 'ఎక్స్లో పోస్టు చేసింది.
అణు ప్రమాద ముప్పును నివారించడానికి సైనిక నియమాలు పాటించాలని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ మరోసారి విజ్ఞప్తి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














