భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ జరిగిందన్న ట్రంప్, టారిఫ్లు18 శాతానికి తగ్గించామని ప్రకటన

ఫొటో సోర్స్, @USAmbIndia
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని అమెరికా 18 శాతానికి తగ్గించిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ ఇరువురూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని, భారతీయ దిగుమతులపై అమెరికా సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
"భారతదేశంలో తయారైన ఉత్పత్తులపై అమెరికాలో విధించే సుంకాలు ఇకపై 18 శాతానికి తగ్గనున్నాయని తెలిసి నాకు సంతోషంగా ఉంది" అని ప్రధాని మోదీ అన్నారు.
"ప్రధాని మోదీపై అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది" అని ఈ ప్రకటన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1


ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ఏమన్నారు?
"నేను చాలాసార్లు చెప్పినట్లుగా, అధ్యక్షుడు ట్రంప్ నిజంగా ప్రధానమంత్రి మోదీని చాలా మంచి స్నేహితుడిగా భావిస్తారు. ఈ సాయంత్రం వాణిజ్య ఒప్పందం వార్తలతో నాకు చాల సంతోషంగా ఉంది. అమెరికా-భారతదేశం సంబంధం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది" భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇన్స్టాగ్రామ్లో సోమవారం రాత్రి పోస్ట్ చేశారు.
దాదాపు ఏడాదికాలంగా రెండు దేశాల మధ్య సంబంధాలలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రి రెండు దేశాల అగ్ర నాయకులు చేసిన ఈ ప్రకటన చాలా కీలకంగా మారింది.
మొదట విధించిన సుంకాలతో పాటు, రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లపై అమెరికా 25 శాతం సుంకం విధించడంతో మొత్తం 50 శాతానికి చేరుకుంది.
డోనల్డ్ ట్రంప్ ఏం చెప్పారు?
"ఈ ఉదయం భారత ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉంది. ఆయన నా ప్రాణ స్నేహితులలో ఒకరు. తన దేశంలో శక్తివంతమైన, గౌరవనీయమైన నాయకుడు. వాణిజ్యం, రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం వంటి అనేక అంశాలపై మేము చర్చించాం. రష్యా చమురు కొనుగోలును ఆపివేసి, అమెరికా నుంచి, బహుశా వెనెజ్వెలా నుంచి మరింత చమురు కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు"
"ఇది యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడంలో సహాయపడుతుంది, ఈ యుద్ధం ప్రతివారం వేలమందిని చంపుతోంది. ప్రధానమంత్రి మోదీ పట్ల స్నేహం, గౌరవం కారణంగా, ఆయన విజ్ఞప్తి మేరకు, అమెరికా, భారతదేశం మధ్య తక్షణమే అమలులోకి వచ్చే వాణిజ్య ఒప్పందానికి మేము అంగీకరించాం. దీని కింద భారతీయ వస్తువులపై సుంకాన్ని 18 శాతానికి అమెరికా తగ్గించింది"
‘‘భారత్ కూడా అమెరికాతో తన సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను జీరో చేసే దిశగా ముందుకు సాగుతుంది. "బై అమెరికన్" విధానం కింద అమెరికా నుంచి మరిన్ని కొనుగోళ్లు చేయడానికి ప్రధానమంత్రి మోదీ తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఇందులో 500 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అమెరికా ఇంధనం, సాంకేతికత, వ్యవసాయం, బొగ్గు, అనేక ఇతర ఉత్పత్తులు ఉంటాయి’’
"భారతదేశంతో మా అద్భుతమైన సంబంధం రాబోయే కాలంలో మరింత బలపడుతుంది. ప్రధానమంత్రి మోదీ, నేను చేసి చూపించే వ్యక్తులం. చాలామంది ఇలా ఉండరు’’ అని డోనల్డ్ ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రేడ్ డీల్ గురించి ప్రస్తావించని ప్రధాని
ప్రధాని మోదీ ఏమన్నారంటే....
"ఇవాళ నా ప్రియమైన స్నేహితుడు, అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకం ఇప్పుడు 18శాతానికి తగ్గనుందని తెలిసి నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రకటన చేసినందుకు భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు"
"ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేసినప్పుడు, అది మన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. పరస్పర ప్రయోజనం కోసం అపారమైన అవకాశాలను అందిస్తుంది"
"ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం చాలా కీలకం. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలలో భారత్ ఆయనకు గట్టి అండగా నిలుస్తుంది. మా భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఆయనతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను" అని ప్రధాని మోదీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మోదీ లొంగిపోయారు - కాంగ్రెస్
"ఆయన (ట్రంప్) వాషింగ్టన్ డీసీ నుంచి 'ఆపరేషన్ సిందూర్'ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. రష్యా, వెనెజ్వెలా నుంచి భారత చమురు కొనుగోళ్లకు సంబంధించిన కొత్త విషయాలను కూడా వాషింగ్టన్ నుంచి అందించారు. వాషింగ్టన్ నుంచి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది'' అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ‘ఎక్స్'లో పోస్ట్ చేశారు .
"ప్రధాని మోదీపై అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి లేదా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మోదీ గతంలోలా స్నేహపూర్వక కౌగిలింతల శైలిలో కాకుండా ట్రంప్కు దూరంగా ఉండిపోయినట్టు కనిపిస్తోంది. ఈసారి మోదీ లొంగిపోయినట్టు కనిపిస్తోంది. కచ్చితంగా ఇది 'అతిపెద్ద ఒప్పందం' కాదు. వాషింగ్టన్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది - మొగాంబో సంతోషంగా ఉన్నారు" అని జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














