You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘మేం చెప్పేదాకా ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు’’ అంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రజలను ఎందుకు హెచ్చరించింది? ఇరాన్ దాడి తీవ్రత ఎంత?
ఇరాన్ తమపైకి క్షిపణుల్ని ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి
"క్షిపణి నిరోధక వ్యవస్థలు పని చేస్తున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ హోమ్ఫ్రంట్ కమాండ్ మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపింది" అని ఇజ్రాయెల్ సైన్యం ఒక సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది.
ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహహరించాలని, అధికారుల సూచనలు పాటించాలని ఐడీఎఫ్ కోరింది.
ప్రభుత్వ హెచ్చరిక అందిన వెంటనే ప్రజలు సురక్షితప్రాంతాల్లో తలదాచుకోవాలని, మళ్లీ సమాచారం అందే వరకు అక్కడే ఉండాలని ఐడీఎఫ్ సూచించింది.
స్పష్టమైన సూచనలు అందిన తర్వాతే ప్రజలు బయటకు రావాలని అధికారులు తెలిపారు.
ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్లోని డిమోనా, అరాద్ నగరాలపై పడ్డాయి. ఈ దాడుల్లో 160 మందికి పైగా గాయపడ్డారు.
డెడ్సీ కి దగ్గరలో ఉన్న అరాద్ మీద క్షిపణుల దాడిలో 88 మంది గాయపడ్డారు. మిస్సైల్ దాడులతో డిమోనాలోని అణు విద్యుదుత్పత్తి కేంద్రం సమీపంలో భారీ నష్టం జరిగింది.
నెతన్యాహు ఏమన్నారు?
ఇరాన్ క్షిపణి దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ‘‘ఈ సాయంత్రం చాలా క్లిష్టమైనది’’ అని అన్నారు.
అరాద్పై క్షిపణి దాడి వల్ల చాలా నష్టం జరిగిందని ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది చెప్పారు.
దాడుల తర్వాత 88 మంది ఆసుపత్రిలో చేరినట్లు మాగెన్ డేవిడ్ అడోమ్ అనే ఎమర్జెన్సీ సర్వీసెస్ సంస్థ తెలిపింది.
దాడుల అనంతరం అరాద్ మేయర్తో మాట్లాడారు నెతన్యాహు. "మన భవిష్యత్ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఈ సాయంత్రం చాలా కష్టమైనది. అన్ని శాఖల సహకారంతో అవసరమైన సాయం అందించాలని నేను నా కార్యాలయ డైరెక్టర్ జనరల్ను ఆదేశించాను" అని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఇజ్రాయెల్ అన్ని ప్రాంతాల్లోనూ తన శత్రువులపై దాడులు కొనసాగిస్తుందని నెతన్యాహు అన్నారు.
స్కూళ్ల మూసివేత
ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్లోని అన్ని పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తాని అధికారులు చెప్పారు.
డిమోనా,అరాద్పై ఇరాన్ దాడుల గురించి హోమ్ ఫ్రంట్ కమాండ్ మేజర్ జనరల్తో చర్చించినట్లు ఇజ్రాయెల్ విద్యాశాఖ మంత్రి తెలిపారు.
"ఇకపై ప్రత్యక్ష తరగతుల్ని అనుమతించం" అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.
స్పెషల్ ఎడ్యుకేషన్ విషయంలో మినహాయింపుల్ని నిలిపివేస్తామని, దేశవ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని ఇజ్రాయెల్ విద్యాశాఖ మంత్రి యోవ్ కిష్ చెప్పారు.
పరిస్థితిని పునఃపరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)