40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన ఉష్ణోగ్రతలు, నార్త్ ఇండియాలో వడగాలుల తీవ్రతను చూపే 8 చిత్రాలు

చదివే సమయం: 3 నిమిషాలు

దిల్లీ సహా ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వీకెండ్‌లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం దిల్లీలోని కొన్ని ఏరియాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటాయి. ఎండల తీవ్రత పెరగడంతో అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు.

రాబోయే రెండు, మూడు రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా మధ్య, పశ్చిమ భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వేసవికాలంలోని తీవ్రమైన ఎండలు ప్రాణాంతకంగా మారొచ్చు. తీవ్రమైన వేడి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవడమే కాకుండా ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం కావచ్చు.

ఉత్తర, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు వారాంతంలో మరో 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగే అవకాశం ఉందని శుక్రవారం వాతావరణ శాఖ తెలిపింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి పాఠశాలలకు దిల్లీ విద్యా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

బహిరంగ ప్రదేశాల్లో క్లాస్‌లు నిర్వహించకూడదని, ఎండలో జరిగే స్కూల్ అసెంబ్లీలను తగ్గించాలని లేదా ఇండోర్‌లో నిర్వహించాలని సూచించింది.

పిల్లలు నీళ్లు తాగాలని గుర్తు చేసేందుకు ప్రతి 45-60 నిమిషాలకు ఒకసారి బెల్ మోగించాలని కూడా సూచించింది.

2024లో భారత్ ఎదుర్కొన్న మూడింట ఒకవంతు వడగాల్పులకు వాతావరణ మార్పులే కారణమని ఆ ఏడాది మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించిన ఒక రిపోర్టులో పేర్కొన్నారు.

2024లో తీవ్రమైన ఎండల కారణంగా దాదాపు 247 బిలియన్ గంటల(24,700 కోట్ల గంటలు) పని సమయాన్ని కోల్పోయినట్లు, దానివల్ల 19,400 కోట్ల డాలర్ల ఆదాయం నష్టపోయినట్లు ఈ రిపోర్ట్ అంచనా వేసింది.

ప్రధానంగా వ్యవసాయం, నిర్మాణరంగం వంటి సెక్టార్లు ప్రభావితమైనట్లు పేర్కొంది.

ఎక్కువ సమయం పాటు తీవ్రమైన వేడికి గురవ్వడం వల్ల ఆరోగ్యంపై పలు దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

ఉష్ణోగ్రతలు పెరిగితే డీహైడ్రేషన్, వడదెబ్బ, గుండె సంబంధిత ఒత్తిడి, మరణం సంభవించే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు, ఆరుబయట పనిచేసే కార్మికుల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)