You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బెంగళూరు: భవిష్యత్తులో నీరు లేక ఒట్టిపోతుందా?
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల ఒక నివేదిక - బెంగళూరు కూడా దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తరహాలోనే నీరు లేకుండా పోయే మొట్టమొదటి భారతదేశ ప్రధాన నగరంగా మారుతుందని పేర్కొంది. కానీ అది నిజంగా జరుగుతుందా?
నీటి వనరులు తగ్గిపోయే పరిస్థితిని ‘నీటి ఒత్తిడి’గా పేర్కొంటారు. బెంగళూరులో తీవ్ర నీటి ఒత్తిడి ఉన్న మాట నిజమే.
'భారతీయ సిలికాన్ వ్యాలీ' అని పిలిచే బెంగళూరు నగరం ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న 100కు పైగా గ్రామాలను తనలో విలీనం చేసుకుని విస్తరించింది. దీని వల్ల నగరంలోని నీటి వనరులపై ఒత్తిడి పెరిగిందని అధికారులు, నిపుణులు అంగీకరిస్తున్నారు.
నగరంలో నీటి కోసం రోజురోజుకీ మరింత లోతుగా బోరు వేయాల్సి వస్తోంది.
బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజీ బోర్డు (బీడబ్యూఎస్ఎస్బీ) 2014లో విడుదల చేసిన ఒక నివేదికలో - బెంగళూరులో నీటి వనరులు అడుగంటనున్నాయని పేర్కొంది.
అయితే 2013 లో ఒక ముఖ్యమైన నిర్ణయంతో బెంగళూరుకు తాత్కాలికంగా పెనుముప్పు తప్పింది.
ఆ ఏడాది కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు తాగునీటి అవసరాల కోసం మరో 10 వేల మిలియన్ ఘనపుటడుగుల నీటిని కావేరి నది నుంచి బెంగళూరుకు తరలించాలని నిర్ణయించింది.
కావేరి కేవలం బెంగళూరు నగర ప్రధాన నీటి వనరు మాత్రమే కాదు, కర్ణాటక నీటి పారుదల అవసరాలు తీర్చే నది కూడా.
'సంతృప్తికరం'గా బెంగళూరులో నీటి సరఫరా
'కావేరి నీటి సరఫరా ఐదవ దశ' ప్రాజెక్టుతో బెంగళూరుకు ప్రస్తుత సరఫరాకన్నా 50 శాతం ఎక్కువ నీరు అందుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జపాన్ ఆర్థిక సహాయం అందిస్తోంది.
కావేరి నదీజలాలతో పాటు రాబోయే 18 నెలలలో నేత్రావతి నది నుంచి కూడా బెంగళూరుకు నీటి సరఫరా అందనుంది.
అందువల్ల ప్రస్తుతం బెంగళూరు నీటి సరఫరా 'సంతృప్తికరం'గా ఉందని నీటి సరఫరా బోర్డు చైర్మన్ తుషార్ గిరినాథ్ తెలిపారు.
''ప్రస్తుతం బెంగళూరులో సగటున ప్రతి వ్యక్తికీ 100 లీటర్ల నీరు అందుతోంది'' అని వెల్లడించారు.
కానీ భవిష్యత్ అవసరాల కోసం నగరంలో 50 కన్నా ఎక్కువ అపార్ట్మెంట్ల ప్రజలు కలిసి చిన్నచిన్న నీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
అదనపు నీటి వనరుల అన్వేషణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న బీఎన్ త్యాగరాజ్ ''రోజూ ప్రతి నగరవాసి ఉపయోగించే 100 లీటర్ల నీటిలో 20 లీటర్లు తాగడానికి, వంటకు, స్నానానికి ఖర్చవుతాయి. మిగిలిన 80 లీటర్లు టాయిలెట్ ఫ్లషింగ్, ఇళ్లు కడగడం, కార్లు తుడవడంలాంటి వాటికి ఖర్చవుతోంది'' అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కూడా నీరు చాలా విలువైన వనరు అని ప్రజలు గుర్తించాలని ఆయన సూచించారు.
కేవలం నీటి సరఫరా పెంచినంత మాత్రాన బెంగళూరు నీటి సమస్య తీరిపోదు. బెంగళూరు వాసులు జల పరిరక్షణ చేపడితేనే నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది.
వాన నీటి పరిరక్షణ కోసం వాటర్ బోర్డు తీవ్రంగా ప్రచారం చేస్తున్నా, ఇంతవరకు దానికి తగిన ప్రతిస్పందన మాత్రం కనిపించడం లేదు.
బెంగళూరులో కేవలం వార్షిక వర్షపాతం ద్వారానే రోజుకు 2,740 మిలియన్ లీటర్ల నీటిని సేకరించవచ్చు అని జలవనరుల నిపుణులు విశ్వనాథ్ శ్రీకాంతయ్య తెలిపారు.
''బెంగళూరుకు ఇప్పుడిప్పుడే వచ్చిన సమస్య ఏమీ లేదు, కానీ ఉన్న నీటి వనరులను మాత్రం సమర్థంగా వినిగించుకోవాలి'' అని శ్రీకాంతయ్య అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)