You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాహుల్ గాంధీ: వయనాడు ఓటర్లలో ముస్లింలు ఎక్కువా లేక హిందువులు ఎక్కువా - BBC Fact Check
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
- చదివే సమయం: 3 నిమిషాలు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడు లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కోసం ప్రియాంకతో కలిసి రాహుల్ వయనాడ్ చేరుకోవడంతో ట్విటర్లో #RahulTharangam (రాహుల్ హవా) అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అయ్యింది. రాహుల్ తన ప్రస్తుత నియోజకవర్గం అమేఠీతోపాటు వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తారని కాంగ్రెస్ ఆదివారంనాడు ప్రకటించింది.
"నామినేషన్ వేసేముందు మేమంతా మీతోనే ఉన్నామనే సందేశాన్ని దక్షిణ భారత ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. అందుకే ఇక్కడి నుంచి నామినేషన్ వేస్తున్నా" అని రాహుల్ వ్యాఖ్యానించారు.
అయితే, అమేఠీలో ఓటమి భయంతోనే రాహుల్ దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. మహారాష్ట్రలోని వార్దాలో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన మోదీ.. రాహుల్ నిర్ణయాన్ని అపహాస్యం చేశారు. మతపరమైన ఉద్దేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
మోదీ వ్యాఖ్యలతో సోషల్ మీడియా యూజర్లలో చాలా గందరగోళం నెలకొంది. వయనాడు నియోజకవర్గంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటమే రాహుల్ పోటీచేయడం వెనక కారణమా అని చాలామంది ప్రశ్నించారు. హిందువుల కన్నా ముస్లింలు ఎక్కువగా ఉండటమే రాహుల్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉద్దేశమని చాలా మితవాద ఫేస్బుక్ గ్రూపులు, ఎందరో ట్విటర్ యూజర్లు కామెంట్ చేశారు.
అయితే, కాంగ్రెస్ మద్దతుదారులు మాత్రం వయనాడ్లో హిందువులే ఎక్కువ, ముస్లింలు, క్రైస్తవులు కాదు అంటూ కొన్ని లెక్కలు చూపిస్తూ రాహుల్కు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేశారు.
ఈ పరస్పర విరుద్ధ సమాచారాన్ని వేలాదిసార్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కానీ, ఈ సమాచారం తప్పు అని మా పరిశోధనలో తేలింది.
వయనాడ్, మలపురం జిల్లాలు, వయనాడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకేసారి షేర్ చేయడంతో ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది.
మొదటి ఆరోపణ: వయనాడులో హిందువులు ఎక్కువ
కాంగ్రెస్ మద్దతుదారులు వయనాడ్ జిల్లా జనాభా లెక్కల ఆధారంగా అక్కడ హిందువులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు.
కానీ, జిల్లాకు, పార్లమెంటరీ నియోజకవర్గానికి మధ్య తేడాను గుర్తించడంలో కొందరు గందరగోళానికి గురయ్యారేమో అనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ముస్లింల కన్నా హిందూ జనాభా ఎక్కువ. వయనాడు జిల్లాలో 50శాతం హిందువులు, 30శాతం ముస్లిం జనాభా ఉంది.
కానీ, జిల్లాకు సంబంధించిన సమాచారం ఆధారంగా వయనాడు ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గమే అని కానీ, కాదు అని కానీ చెప్పలేం. వయనాడ్ జిల్లా వేరు, వయనాడ్ లోక్సభ స్థానం వేరు.
2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడిన వయనాడు నుంచి ఇప్పుడు రాహుల్ పోటీచేస్తున్నారు. కోజికోడ్, మలపురం, వయనాడ్ జిల్లాలతో కలిపి ఈ నియోజకవర్గం ఏర్పడింది.
రెండో ఆరోపణ: వయనాడులో మెజారిటీ జనాభా ముస్లింలు
ముస్లిం మెజారిటీ ఓట్లతో విజయం సాధించాలని రాహుల్ వయనాడు నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ మద్దతుదారులు అంటున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే మలపురం జిల్లా కూడా వయనాడులో భాగమే కనుక రాహుల్ దీన్ని ఎంచుకున్నారని కూడా కొంతమంది ట్వీట్లు చేశారు.
కేరళలోని 20 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటైన వయనాడు 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమాహారం.
- కోజికోడ్ జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో తిరువంబాడి స్థానం ఒక్కటే వయనాడు లోక్సభ స్థానం పరిథిలోకి వస్తుంది.
- వయనాడ్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సీట్లు కాల్పెట్ట, సుల్తాన్ బతేరీ, మనంతవాడి వయనాడ్ లోక్సభ నియోజకవర్గం కిందకు వస్తాయి.
- మలపురం జిల్లాలోని 16 అసెంబ్లీ సీట్లలో కేవలం మూడు (ఎరనాడ్, వందూర్, నీలాంబుర్) మాత్రమే వయనాడ్ పార్లమెంటరీ పరిథిలోకి వస్తాయి.
మలపురంలో హిందువుల కన్నా ముస్లింలు ఎక్కువ అనేది వాస్తవం. 2011 జనాభా లెక్కల ప్రకారం మలపురంలో 74% మంది ముస్లింలుంటే, హిందూ జనాభా 24%.
కానీ, వయనాడు నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువ అనే విషయం ఎక్కడా స్పష్టం చేయలేదు. ఎందుకంటే మలపురం జిల్లాలోని పావువంతు మాత్రమే వయనాడ్ పరిథిలో ఉంటుంది.
వయనాడు లోక్సభ స్థానం పరిథిలోని ఓటర్ల సంఖ్య 13,25,788. ఇది ఆ ప్రాంత జనాభా కన్నా చాలా తక్కువ.
కేరళ ఎన్నికల సంఘం ప్రకారం, 2014 ఎన్నికల తర్వాత వయనాడ్ స్థానం పరిథిలో 75000 మంది కొత్త ఓటర్లు చేరారు. కానీ వీరు ఏ మతానికి చెందినవారనే సమాచారం ఎన్నికల సంఘం దగ్గరలేదు.
"2014 ఎన్నికల సమయంలో ఇక్కడి ఓటర్ల సంఖ్య 12,47,326. ఇప్పుడది పెరిగింది. కానీ హిందువులు, ముస్లింలను ఎన్నికల సంఘం వేరుగా గుర్తించదు" అని ఎన్నికల సంఘం ప్రతినిధి తెలిపారు.
ఇంతకీ ఎవరు ఎంతమంది ఉన్నారు?
మతం ఆధారంగా ఏ లోక్సభ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లున్నారనే సమాచారం డేటానెట్ అనే ఓ స్వతంత్ర సంస్థ దగ్గర ఉంది. అయితే తమ దగ్గరున్న వివరాలు కూడా ఓ అంచనా మాత్రమేనని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే తుక్రాల్ బీబీసీకి చెప్పారు.
"మేం ముందుగా 2008లో, లోక్సభ నియోజకవర్గం పరిథిలోకి వచ్చే గ్రామాలను, పట్టణాలను, జిల్లాలను గుర్తించాం. ఆ తర్వాత 2001, 2011 జనాభా లెక్కల వివరాల నుంచి మతపరమైన సమాచారాన్ని లింక్ చేసి చూశాం. చివరిగా, గ్రామస్థాయిలో, తర్వాత మొత్తం నియోజకవర్గంలో ఎవరు ఎంతమంది ఉన్నారనే ఓ అంచనాలను రూపొందించాం" అని ఆయన తెలిపారు.
ఆయన అందించిన వివరాల ప్రకారం, వయనాడు నియోజకవర్గంలో హిందువులు, ముస్లింల జనాభా దాదాపు సమానంగా ఉంది. హిందువులు, ముస్లింలు 40-45% మంది ఉంటే, క్రైస్తవులు 15% మంది ఉంటారని ఆయన తెలిపారు.
డేటానెట్ అంచనాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
ఇవి కూడా చదవండి.
- రాహుల్ గాంధీ: మోదీని ఢీకొని ప్రధాని పదవి సాధించగలరా...
- ‘దక్షిణ భారతదేశాన్ని మోదీ పట్టించుకోవట్లేదు.. అందుకే నేను కేరళ నుంచి పోటీ చేస్తున్నా’ - రాహుల్ గాంధీ
- మోదీతో రాహుల్ ప్రజలను ఆకట్టుకోవడంలో పోటీపడగలరా?
- వయనాడు: 'కేరళ రాష్ట్రంలో మతపరమైన అంశాలకు ఓట్లు రాలవు...'
- కాంగ్రెస్కు రాహుల్ గెలుపు గుర్రం అవుతారా?
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- భీమా కోరేగావ్ అల్లర్ల కేసు ఎక్కడిదాక వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)