రైతుల ఆందోళనలు: ఉద్రిక్తతల నడుమ 'ఛలో దిల్లీ'

చదివే సమయం: 2 నిమిషాలు

సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.

రైతు సంఘాలు 'ఛలో దిల్లీ'కి పిలుపునివ్వడంతో పలు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున రైతులు దిల్లీకి బయలుదేరారు.

పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే, రైతులు తమ ఆందోళనలను విరమించాలని, వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడే ధర్నాకు దిగుతామని రైతు సంఘాల నాయకులు ముందే ప్రకటించారు. ముఖ్యంగా పంజాబ్‌ నుంచి వస్తున్న రైతులను తమ రాష్ట్రంలోకి రాకుండా హరియాణా ప్రభుత్వం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

హరియాణాలో ఉద్రిక్తత-వాటర్‌ క్యానన్‌ల ప్రయోగం

వేలాది ట్రాక్టర్లలో దిల్లీవైపు వస్తున్న పంజాబ్‌ రైతులను తమ రాష్ట్ర సరిహద్దుల వద్ద హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. శంభు నది వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

రైతులను వెనక్కి పంపేందుకు జల ఫిరంగులను, టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. హరియాణా, దిల్లీ హైవేపై పెద్ద సంఖ్యలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. భద్రతను పర్యవేక్షించేందుకు డ్రోన్‌ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు.

నిన్ననే దిల్లీకి చేరుకుని గురుద్వారాలలో ఉన్న అనేకమంది పంజాబ్‌ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడిచి పెట్టారు.

"రైతు సంఘాల ఆందోళనకు ప్రభుత్వ అనుమతి లేదు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన వారిని అదుపు చేయడానికి సిద్ధంగా ఉన్నాం'' అని సోనేపట్‌ ఎస్పీ జషన్‌దీప్‌ రంధవా బీబీసీతో అన్నారు.

ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులపై వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడం బీజేపీ నిజస్వరూపాన్ని తెలియజేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ.రాజా వ్యాఖ్యానించారు.

దిల్లీ శివారు ప్రాంతాలకు మెట్రో బంద్

గురువారం దిల్లీ చేరుకోవడానికి బయలుదేరిన రైతులను ఎక్కడికక్కడే ఆపేందుకు అటు హరియాణా, దిల్లీ ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి.

మెట్రో రైళ్లలో రైతులు దిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున నోయిడా, ఫరీదాబాద్‌, ఘాజియాబాద్, గురుగ్రామ్‌ ప్రాంతాలకు వరకు నడిచే రైళ్లను దిల్లీ మెట్రో తాత్కాలికంగా రద్దు చేసింది.

శుక్రవారం నాడు నోయిడా, ఫరీదాబాద్‌, ఘాజియాబాద్, గురుగ్రామ్‌‌ల నుంచి దిల్లీలోకి వచ్చే మెట్రో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. దిల్లీ పోలీసులు సూచనతో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)